అయోధ్య కేసుపై సుప్రీం కీలక నిర్ణయం

ఈరోజుటీవి/న్యూఢిల్లీ: రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును కొత్త ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయోధ్య వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ కోసం ఈ నెల 10న కొత్త బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. విచారణ ప్రక్రియపై నూతన ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా అయోధ్య కేసుపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇంతకు ముందే తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అయోధ్య వివాదంపై దాఖలైన మొత్తం 14 పిటిషన్లపై విచారణ కోసం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి.